ఇంటర్నెట్డెస్క్ : చిన్నారులు ధరించే స్కూల్ యూనిఫాంలు వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని తాజా పరిశోధనలో తేలింది. ముఖ్యంగా విద్యార్థినులు స్కూల్ యూనిఫాంలో ఆటలు ఆడాలంటే ఎంతో ఇబ్బందిగా ఉందని వారు అభిప్రాయపడుతున్నట్లు తాజాగా కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. ప్రత్యేకించి మైదానంలో విద్యార్థినీలు ఆటలు ఆడాలంటే.. స్కర్ట్స్, డ్రెస్సులు ధరిస్తే మంచిదని వారు భావిస్తున్నట్లు తాజా పరిశోధన వెల్లడించింది. ‘రోజులో ఎక్కువ గంటలు విద్యార్థినీ, విద్యార్థులు స్కూల్ యూనిఫాంలను ధరించి ఉంటారు. ఈ యూనిఫాంల వల్ల విద్యార్థినీ.. విద్యార్థులకు కొంత సౌకర్యంగానూ.. అసౌకర్యంగానూ ఉంటుంది. కానీ విద్యార్థినీలకు సౌకర్యవంతంగా ఉండేలా యూనిఫాంలను సూచిస్తే మంచిది. వాతావరణ మార్పులకు తగ్గట్టుగా యూనిఫాంల డిజైన్లను స్కూలు కమ్యూనిటీలు ఎంపిక చేసుకోవాలి’ అని కేంబ్రిడ్స్ యూనివర్సిటీ పరిశోధకుడు డాక్టర్ మైరెడ్ ర్యాన్ అన్నారు.
యువతీ, యువకులు మాత్రమే కాదు.. టీనేజ్ వయసు పిల్లలు రోజులో గంటపాటు శారీరక వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) సిఫార్సు చేస్తోంది. స్కూల్కి నడుచుకుంటూ వెళ్లడం.. లేదా సైకిల్పై వెళ్లడం వంటి వ్యాయామాలు విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయి. పాఠశాల విరామ సమయంలో ఆటలు ఆడడం, స్కూల్ టైమ్ అయిపోయిన తర్వాత కూడా అవుట్డోర్ గేమ్స్ ఆడటం వల్ల టీనేజ్ వయసు పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపదు. ఆటలు వారి ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి అని ర్యాన్ తెలిపారు.
స్కూల్లో రోజువారీ ఆటలు ఆడని 75 దేశాల్లోని పాఠశాలలు విద్యార్థులు యూనిఫాం ధరించడానికి ఇష్టపడుతున్నారు అని సర్వేల్లో తేలింది. దీంతో స్కూల్ యూనిఫాంలు వేసుకునే వారి శాతం 16 శాతం నుంచి 19.5 శాతానికి పెరిగింది. చాలా దేశాల్లోని విద్యార్థినీలు యూనిఫాంలు ధరించి మైదానంలో ఆడలేకపోతున్నామని.. అందుకే తామంతా ఆటలకు దూరమవుతున్నారని చెబుతున్నారు. అందుకే వారంతా.. త్వరగా అనారోగ్యాలకి గురవుతున్నారని పరిశోధకులు ర్యాన్ చెబుతున్నారు. స్కూల్లో ఆటలు ఆడకపోవడం.. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల విద్యార్థినీ, విద్యార్థులు అధికంగా బరువు పెరుగుతున్నారు. ఊబకాయ సమస్యలకు గురికావడం వల్ల టైప్ 2 మధుమేహం, అధిక రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధుల వంటి సమస్యలకు దారితీస్తుంది. చిన్న వయసులోనే ఊబకాయ సమస్యతో బాధపడితే.. భవిష్యత్తులో దీర్ఘకాలిక అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.