అధికారంలోకొస్తే విశాఖ నుంచే పాలన : మంత్రి బొత్స

Apr 18,2024 21:30 #Minister Botsa, #press meet

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విశాఖ నుంచి సిఎం పాలన కొనసాగిస్తారని, ఇక్కడే ప్రమాణస్వీకారం చేస్తారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖలోని లాసన్స్‌బే కాలనీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన ఉత్తరాంధ్రను గత టిడిపి ప్రభుత్వం మరింత వెనుకబాటుకు గురిచేసిందన్నారు. విశాఖకు సహజ వనరులు, పరిశ్రమలు, రోడ్డు, ఎయిర్‌, సీ కనెక్టివిటీ ఉన్నాయని, ఈ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో సిఎం తీర్చిదిద్దుతారని తెలిపారు. తమ ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్‌ జరగడం లేదని కొంతమంది అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో సిపిఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సాధ్యం కాలేదని, దానికి ప్రత్యామ్నాయంగా ఉద్యోగులకు మేలు చేసే స్కీమును తీసుకువచ్చామని చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. నాసిరకం మద్యాన్ని విక్రయిస్తున్నట్టు చంద్రబాబు అండ్‌ కో విమర్శలు చేస్తున్నారని, వారు ఏ ల్యాబ్‌లో టెస్టులు చేశారని, నాసిరకమని ధ్రువీకరించిందేవరని ప్రశ్నించారు. అసలు మద్యపానానికే తమ ప్రభుత్వం వ్యతిరేకమన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణపై చంద్రబాబు తన వైఖరి ఏమిటో చెప్పాలని సవాలు విసిరారు.

➡️