సామాజిక న్యాయానికి బిజెపి తూట్లు

May 4,2024 22:55 #cpm v srinivasarao, #speech
  •  అటవీ చట్టాలు నిర్వీర్యం, ఉత్పత్తులకు దక్కని ‘మద్దతు’
  •  వంతపాడుతున్నటిడిపి, వైసిపి
  • ‘ఇండియా’ గెలుపుతోనే న్యాయం : వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడవిబిడ్డలనూ వదిలిపెట్టడం లేదని, రాజ్యాంగబద్ధంగా సాధింకున్న హక్కులను హరించి అటవీ సంపదను, వనరులను కార్పొరేట్లకు దోచిపెడుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. గడిచిన పదేళ్లలో సామాజిక న్యాయానికి బిజెపి అడుగడుగునా తూట్లు పొడిచిందన్నారు. దానికి రాష్ట్రంలోని టిడిపి, వైసిపి వంత పాడుతున్నాయని వి శ్రీనివాసరావు అన్నారు. వామపక్షాలు, ఇండియా వేదిక గెలుపుతోనే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కొమరాడ, కూనేరు గ్రామాల్లోనూ, గరుగుబిల్లి, జియ్యమ్మవలస మండల కేంద్రాల్లోనూ శనివారం జరిగిన సిపిఎం ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. కూనేరు సంతలోనూ, ఇతక గ్రామాల్లోనూ సిపిఎం నాయకులకు పూలమాలలు, హారతులతో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా జరిగిన సభల్లో శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి సామాజిక న్యాయాన్ని దెబ్బతీస్తోందన్నారు. అందులో భాగంగానే 5వ షెడ్యూల్‌, పీసా, 1/70 చట్టాన్ని ఉల్లంఘించి అడవులు, కొండ కోనలను దోచుకోవడానికి, కార్పొరేటర్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని వివరించారు. ఇప్పుడు ముస్లిముల రిజర్వేషన్లు ఎత్తి వేస్తున్న బిజెపి… తరువాత అందరి హక్కులనూ దెబ్బతీస్తుందన్నారు. మత ఘర్షణలు సృష్టించి దేశంలో అధికారం నిలుపుకోవడానికి ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మన్యంలో జీడి, అరకులోయలో కాఫీ సహా ఆనేక గిరిజన, వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేదన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని తెలిపారు. అటవీ సంరక్షణ చట్టం పేరిట పోడు పట్టాలను వెనక్కి తీసుకుంటున్నారన్నారు. వీటన్నిటికీ సిపిఎం, ఇండియా వేదిక అడ్డుకట్ట వేస్తుందని తెలిపారు. అదాని కోసం రాజమండ్రి నుంచి అరకు వరకు రూ.10 వేల కోట్లుతో రోడ్డు వేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తొమ్మిది పంచాయతీల్లో సుమారు 45 గిరిజన గ్రామాలకు 70 కిలోమీటర్ల దూరం తగ్గించే పూర్ణపాడు-లాబేసు వంతెనను మాత్రం పూర్తి చేయడం లేదన్నారు. గతంలో సిపిఎం చేసిన అనేక పోరాటాల ఫలితంగా రూ.14 కోట్లతో ఈ వంతెన నిర్మాణాన్ని తలపెట్టారని గుర్తు చేశారు. నిర్మాణం పూర్తి కాకపోవడంతో గిరిజనులు వ్యవసాయ ఉత్పత్తులు, గిరిజన సంపద క్రయవిక్రయాలకు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. వంతెన పూర్తికి స్థానిక ఎమ్మెల్యే సహకరించడం లేదన్నారు. కాంట్రాక్టర్‌ను డబ్బులు డిమాండ్‌ చేసిన పుష్ప శ్రీవాణిని ఈ ఎన్నికల్లో ఓడించాలని కోరారు. నియోజకవర్గంలో రోడ్లు, ఆస్పత్రులు, పాఠశాలలు ఏర్పాటు చేయలేదన్నారు. ఉన్న పాఠశాలలను కూడా ఎత్తి వేస్తుండడంతో మన్యం జిల్లా అక్షరాస్యతలో వెనుకబడి పోయిందని తెలిపారు. అవినీతిలో కూరుకుపోయి బెయిల్‌పై బయటకు వచ్చిన టిడిపి, వైసిపి, బిజెపి నాయకులను ఓడించాలని కోరారు. ప్రజాసమస్యలపై పోరాడినందుకు ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి సిపిఎం, వామపక్ష నాయకులను జైలుకు పంపిందన్నారు. ఇక్కడి బిజెపి ఎంపి అభ్యర్థి కొత్తపల్లి గీత, వైసిపి కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేసి గిరిజనులను మోసం చేస్తున్నారని విమర్శించారు. అటువంటి బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకోవడాన్ని నిరసిస్తూ ఈ ప్రాంతానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి కిషోర్‌చంద్రదేవ్‌ టిడిపికి రాజీనామా చేసి సిపిఎం ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బులు పంచిన వారిని కాకుండా నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తున్న సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వారితోపాటు ఇండియా వేదికలోని కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ ప్రజా సమస్యలు, అభివృద్ధిపై బిజెపి, టిడిపి, వైసిపి మాట్లాడకుండా మాటల గారడితో ప్రజలను మరోసారి మోసగించాలని చూస్తున్నాయని విమర్శించారు. గిరిజనుల బతుకులు బాగుపడాలంటే సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పోరాడుతున్న సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.ఇందిర, కురుపాం సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ, సిపిఎం నాయకులు రెడ్డి శంకర్రావు మాట్లాడారు. అనంతరం అర్ధాంతరంగా నిలిచిపోయిన పూర్ణపాడు-లాబేసు వంతెనను నాయకులు పరిశీలించారు.

➡️