న్యూఢిల్లీ : ఆమ్ఆద్మీ పార్టీ ఎంపి స్వాతి మలివాల్ ఆ పార్టీని వీడి.. బిజెపిలోకి చేరతున్నట్లు వార్తలొచ్చాయి. ఈ వార్తల్ని మలివాల్ తీవ్రంగా ఖండించారు. తాను ఆప్ని వీడేది లేదని ఆమె స్పష్టం చేశారు. కాగా, మలివాల్పై ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ వ్యక్తిగత అనుచరుడు బిభవ్ కుమార్ ఈ నెల 13వ తేదీన దాడి చేశాడు. ఈ దాడికి సంబంధించి ఆప్ పార్టీపైనా, కేజ్రీవాల్పైనా బిజెపి నేతలు విమర్శించారు. కేజ్రీవాల్ని సిఎం పదవికి రాజీనామా చేయమని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మలివాల్ ఆప్ని వీడతారని, ఆమె బిజెపిలోకి చేరతారనే ప్రచారం జోరందుకుంది. వీటిపై తాజాగా ఆమె ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘బిజెపి నేతలు ఎవరూ నాతో టచ్లో లేరు. నేను ఆప్లోనే కొనసాగుతాను. ఆ పార్టీ ఏ ఒక్కరిదో, ఇద్దరిదో కాదు. నేను పార్టీ కోసం చెమట, రక్తాన్ని ధారపోశాను. నాపై దాడి జరిగిన తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ వీకె సక్సేనా మాత్రమే నాతో మాట్లాడారు. ఆయన ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి.’ అని ఆమె అన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/swati-malival-copy-1.jpg)