అమరావతి : అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. అంగన్వాడీలు, మున్సిపల్, సమగ్రశిక్షా ఉద్యోగులకు మద్దతుగా … మంగళవారం అన్ని కార్మిక సంఘాలు జైల్భరోకు పిలుపునిచ్చాయి. సమ్మెలు సాగుతున్నా.. స్పందించని ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టనున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమాలు జరుగుతాయని నాయకులు ప్రకటించారు. ఆయా జిల్లాల్లో కార్మిక, ప్రజా సంఘాలు, రైతు, వ్యవసాయ కార్మిక, రైతు, కౌలు రైతు సంఘాలు నిరసనను ఉధృతంగా నిర్వహించాయి. ఎక్కడికక్కడ పోలీసులు ఆందోళనకారులపై జులుం ప్రదర్శించారు. బలవంతపు అరెస్టులు చేశారు. ఇది రాష్ట్ర కార్మికోద్యమ చరిత్రలో, ప్రజాతంత్ర ఉద్యమ చరిత్రలో నిరంకుశ చర్య అని ట్రేడ్ యూనియన్స్, రైతు, వ్యవసాయ కార్మిక, కౌలు రైతు సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
శ్రీకాకుళం కలెక్టరేట్ : శ్రీకాకుళంలో కార్మిక, ప్రజా సంఘాలు, వ్యవసాయ, రైతు, కౌలు రైతులు చేపట్టిన ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. నేతలను బలవంతపు అరెస్టులు చేశారు.
ప్రజాశక్తి-విజయవాడ : నేడు విజయవాడలో చేపట్టిన ‘ జైల్ భరో ‘ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నేతలను పోలీసులు బలవంతపు అరెస్టులు చేశారు. అద్దంకిలో మున్సిపల్, అంగన్వాడి కార్యకర్తలు అరెస్టయ్యారు.
కాకినాడ : కాకినాడ కలెక్టరేట్లోకి చొచ్చుకుని వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. కలెక్టరేట్ గేటును తోసుకుంటూ ముట్టడించారు. పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకుని నాయకులను అరెస్టు చేశారు.