ఇప్పటికాలంలో పిల్లల్ని మూడో సంవత్సరం రాగానే స్కూల్లో చేర్పిస్తున్నారు. అప్పటివరకూ తల్లి,దండ్రుల గారాబంతో ఉన్న పిల్లలు ఒక్కసారిగా స్కూలు వాతావరణంలోకి రాగానే మౌనంగా ఉండిపోతారు. తమలో తామే ఘర్షణకు లోనవుతూ టీచర్తోగానీ, తోటి పిల్లలతోగానీ మాట్లాడరు. అటువంటి వారిని కొన్ని రకాల ఆటలు ఆడిస్తే వారిలో కదలిక వస్తుందని నిపుణులు అంటున్నారు. కప్పగంతులు ఆట అందరికీ తెలిసిందే అయినా…ఇది పిల్లల్ని శారీరకంగానే కాదు మానసికంగానూ మంచి వ్యాయామం అంటున్నారు.
ఇలా ఆడాలి : ఒక క్లాస్లో ఉన్న పిల్లలందరినీ 5,6 మందితో ఒక బ్యాచ్గా ఉండేలాగా పిల్లలందరిని గ్రూపులుగా విడగొట్టాలి. ఒక్కో బ్యాచ్ ఒక గీత మీద వరుసగా కూర్చొని కప్ప గెంతినట్లు గెంతుతూ ఎదురుగా దూరంగా ఉన్న గీత వద్దకు చేరుకోవాలి. బ్యాచ్లో అందరికంటే ముందుగా లక్ష్యం చేరుకొన్న వాడిని వేరు చేయాలి.
ఇలా అన్ని బ్యాచ్లు పూర్తి అయిన తర్వాత ప్రతి బ్యాచ్లోనూ మొదటి స్థానం పొందిన వారిని ఒక బ్యాచ్గా చేసి మళ్లీ వాళ్ల చేత ఆడించాలి. ఇప్పుడు మొదటి, రెండు, మూడు స్థానాలలో నిలిచిన వారు విజేతలు అవుతారు. దాంతో మిగిలిన పిల్లల్లోనూ కదలిక వస్తుంది. వీరి కంటే ఇంకా బాగా గెంతాలన్న పోటీ అలవడుతుంది.