చరిత్ర సృష్టించిన భారత ఆర్చర్లు

Apr 28,2024 09:48 #Sports

ప్రపంచకప్‌ ఆర్చరీలో మూడు స్వర్ణాలు కైవసం
షాంఘై: ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-1 టోర్నీలో భారత ఆర్చర్లు అదరగొట్టారు. కాంపౌండ్‌ మిక్స్‌డ్‌, పురుషుల టీమ్‌ ఈవెంట్‌, మహిళల టీమ్‌ విభాగాల్లో భారత్‌కు స్వర్ణ పతకాలు దక్కాయి. దీంతో ఒకేరోజు భారత ఆర్చర్లు హ్యాట్రిక్‌ స్వర్ణాలతో సత్తా చాటారు. మిక్స్‌డ్‌ డబుల్‌ ఈవెంట్‌, మహిళా జట్టు గోల్డ్‌ మెడల్స్‌ సాధించడంలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కీలక పాత్ర పోషించింది. శనివారం జరిగిన కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో సురేఖ-అభిషేక్‌ వర్మ జోడి 158-157 తేడాతో ఎస్తోనియా జట్టుపై విజయాన్ని నమోదు చేసింది. మహిళల జట్టు విభాగంలోనూ. భారతీయ అమ్మాయిలు అద్భుత విజయం సాధించారు. ఇటలీకి చెందిన మార్సెల్లా టినిలి, ఐరెనె ఫ్రాంచిని, ఎలీసా రోనెర్‌పై వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్నీత్‌ కౌర్‌తో కూడిన భారత జట్టు.. 236-225 తేడాతో గెలుపొందారు. ప్రత్యర్థి ఆటగాళ్లకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా, మన అమ్మాయిలు చెలరేగి ఆడటంతో.. ఈ విజయం సొంతం అయ్యింది. అటు.. పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో అభిషేక్‌ వర్మ, ప్రియాన్ష్‌, ప్రథమేశ్‌తో కూడిన భారత జట్టు నెదర్లాండ్‌కు చెందిన మైక్‌ స్కాలోసెర్‌, సిల్‌ పటెర్‌, స్టెఫ్‌ విలిమ్స్‌ టీమ్‌పై 238-231 తేడాతో గెలుపొంది హ్యాట్రిక్‌ స్వర్ణ పతకాన్ని ఖాయం చేశారు. మూడు విభాగాల్లో భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు కైవసం చేసుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇక రికర్వ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో అంకిత బాకత్‌- బమ్మదేవర ధీరజ్‌ జోడీ మెక్సికోతో తలపడనుండగా.. మహిళల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో స్టార్‌ ఆర్చర్‌ దీపిక కుమారి సెమీఫైనల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.

➡️