Spain Masters: సింధు శుభారంభం

Mar 28,2024 11:09 #Badminton, #PV Sindhu, #Sports
  • స్పెయిన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌

మాడ్రిడ్‌ (స్పెయిన్‌) : భారత అగ్రశ్రేణి షట్లర్‌ పి.వి సింధు మాడ్రిడ్‌ స్పెయిన్‌ మాస్టర్స్‌ టోర్నీలో శుభారంభం చేసింది. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ ముంగిట ఓ టైటిల్‌ విజయంపై కన్నేసిన సింధు.. స్పెయిన్‌ మాస్టర్స్‌ మహిళల సింగిల్స్‌లో ప్రీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సింధు వరుస గేముల్లో గెలుపొందింది. రెండో సీడ్‌ సింధు 21-16, 21-12తో కెనడా షట్లర్‌ వెన్‌ యు జాంగ్‌ను చిత్తు చేసింది. 30 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్‌లో సింధు ఆధిపత్యం చూపించింది. తొలి గేమ్‌లో విరామ సమయానికి 10-11తో వెనుకంజ వేసిన సింధు.. విరామం తర్వాత వరుస పాయింట్లతో 14-11తో ఆధిక్యం సాధించింది. 14-14తో జాంగ్‌ స్కోరు సమం చేసినా.. ఆ తర్వాత జోరుందుకున్న సింధు ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం లేకుండా 21-16తో తొలి గేమ్‌ను గెల్చుకుంది. రెండో గేమ్‌ను సింధు ఏకపక్షంగా నెగ్గింది. 5-5 తర్వాత జాంగ్‌ నుంచి ప్రతిఘటనే లేదు. 11-8తో విరామ సమయానికి ముందంజలో నిలిచిన సింధు.. 21-12తో రెండో గేమ్‌ను, ప్రీ క్వార్టర్‌ఫైనల్‌ బెర్త్‌ను సొంతం చేసుకుంది.

➡️