డ్రగ్స్‌తో మాకు సంబంధం లేదు…

Mar 24,2024 21:45 #press meet, #vijaysaireddy

-టిడిపి నేతల హస్తముంది : ఎంపి విజయసాయిరెడ్డి
ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి :విశాఖపట్నం డ్రగ్స్‌ కేసులో వైసిపికి ఎలాంటి సంబంధమూ లేదని ఎంపి, నెల్లూరు వైసిపి అభ్యర్థి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన నెల్లూరులోని తన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ బ్రెజిల్‌లో ఎన్నికలు జరిగినప్పుడు, అక్కడ ఎన్నికైన ప్రభుత్వానికి వైసిపి పార్లమెంట్‌ ఫ్లోర్‌ లీడర్‌గా శుభాకాంక్షలు చెప్పానని, దీనికి, వైజాగ్‌కు వచ్చిన డ్రగ్స్‌కు ఏమి సంబంధమని ప్రశ్నించారు. డ్రగ్స్‌ విషయంలో టిడిపి నేతల ప్రమేయం ఉందని ఆరోపించారు. సిబిఐ విచారణ అనంతరం ఎవరి ప్రమేయం ఏమిటో బయట కొస్తుందన్నారు. అరబిందో ఎలక్ట్రోరల్‌ బాండ్ల విషయంలో టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని, గత ఎన్నికల్లో ఎంత తీసుకున్నారో తన వద్ద లెక్కలున్నాయని వివరించారు. అధికార పార్టీకి ఒక్క రూపాయి ఇస్తే, ప్రతిపక్షాలకు కనీసం పావలా అయినా వ్యాపారులు బాండ్ల రూపంలో ఇస్తారన్నారు. దీనిని రాజకీయం చేయడం సరికాదని పేర్కొన్నారు. తనకు విశాఖలో ఓటు ఉందని, దానిని నెల్లూరుకు మార్చుకుంటానని, భవిష్యత్తులో తన సొంత ప్రాంతమైన నెల్లూరులోనే ఇల్లు నిర్మించుకుంటానని చెప్పారు. విలేకర్ల సమావేశంలో వైసిపి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ పి.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గన్నారు. జనసేన పార్టీ నుండి వంద మంది కార్యకర్తలు వైసిపిలో చేరారు. వారికి విజయసాయిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

➡️