కాంగ్రెస్ నాయకులను నిర్బంధించిన పోలీసులు
పిసిసి ఉపాధ్యక్షులు సత్యవతి
ప్రజాశక్తి- ఆమదాలవలస
నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని పిసిసి ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి అన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దగా డిఎస్సి వద్దు, మెగా డిఎస్సి ముద్దు అంటూ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరైన బొడ్డేపల్లి సత్యవతిని పోలీసులు అదుపులోకి తీసుకొని విజయవాడలోని గాంధీనగర్లో చాంద్ కళ్యాణ మండపానికి తరలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిఎం జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్లు మొద్దు నిద్రలో ఉండి నేడు దగా డిఎస్సిని ప్రకటించడం నిరుద్యోగులను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో నిరుద్యోగులందరికీ న్యాయం చేస్తానని, ప్రతి ఏడాది జనవరిలో జాబ్ కేలండర్ రిలీజ్ చేస్తానన్న హామీని తుంగలో తొక్కి నేడు తప్పుడు నోటిఫికేషన్లు ఇస్తూ ఉద్యోగులతో పాటు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. అన్ని వర్గాల వారిని వైసిపి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో వైసిపి కేంద్రంలోని బిజెపికి అన్ని బిల్లుల్లోనూ సహకరించి బి టీంగా వ్యవహరించిందని మండిపడ్డారు. అరెస్ట్ అయిన వారిలో పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనపల అన్నాజీరావు, కాంగ్రెస్ నాయకురాలు జి.రజిని ఉన్నారు.