కలెక్టరేట్ ఎదుట ధర్నాలో మాట్లాడుతున్న అంజిబాబు
– సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు
ప్రజాశక్తి – కర్నూలు కలెక్టరేట్
విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని మహారాజా మెడికల్ సైన్సెస్ వైద్య కళాశాలలోని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్డి.అంజిబాబు డిమాండ్ చేశారు. మిమ్స్ వైద్య కళాశాల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సిఐటియు ఓల్డ్ సిటీ కార్యదర్శి విజరు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని మిమ్స్ వైద్య కళాశాలలో పని చేస్తున్న కార్మికులు సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తుంటే నాయకులను తొలగించారని తెలిపారు. వారిని వెంటనే పనిలోకి తీసుకోవాలని కార్మికులందరూ ఆందోళన చేస్తుంటే వారిపైన విచక్షణారహితంగా దాడులు చేసి, పోలీసు కేసులు బనాయించడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. మిమ్స్ వైద్య కళాశాల యాజమాన్యం తన మొండి వైఖరిని విడనాడి వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న ఏడు డిఎలను వెంటనే చెల్లించాలని, తొలగించిన కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని కోరారు. సిఐటియు ఓర్వకల్లు మండల అధ్యక్ష, కార్యదర్శులు శ్రీధర్, షాజహాన్, సిఐటియు నగర నాయకులు ఏసు పాల్గొన్నారు.