కుప్పం : చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కుప్పం పురపాలక పరిధిలోని సామగుట్టపల్లె వద్ద ఉన్న కదరిబండ నరసింహస్వామి దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సామగుట్టపల్లెలో కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. కుప్పం తెదేపా కార్యాలయంలో ముస్లిం మైనారిటీ మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతపురం జిల్లాలోని కణేకల్లో విద్యార్థులు, తెదేపా నాయకులతో కలిసి చంద్రబాబు కేక్ కోశారు. తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను తిరుమలలో ఘనంగా నిర్వహించారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేశారు. రాయలసీమ తెదేపా నేత శ్రీధర్.. శ్రీవారి ఆలయం అఖిలాండం వద్ద 750 టెంకాయలు కొట్టారు. 7.50 కిలోల కర్పూరం వెలిగించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు, కార్యకర్తలు పాల్గన్నారు.