ఇవిఎంల కమిషన్ను పరిశీలిస్తున్న కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
ఇవిఎంల కమిషన్ ప్రక్రియ జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలాశ్రీష సమూన్ ఆదేశించారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇవిఎంల కమిషన్ ప్రక్రియను శుక్రవారం పరిశీలించారు. ఇవిఎంలపై సీరియల్ నంబర్లు, అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన చిహ్నాల ఏర్పాటు సిసి కెమెరాల ఎదుట పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. కమిషనింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి, ఇవిఎంల పనితీరు పరిశీలించి, వారికి పూర్తిస్థాయిలో నమ్మకాన్ని కలిగించాలని సూచించారు. రెండో విడత ర్యాండమైజేషన్లో కేటాయించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల నంబర్లను కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివి ప్యాట్లను ఆయా పోలింగ్ కేంద్రాలకు కేటాయించే ప్రక్రియ జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు.పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాల తనిఖీఅనంతరం అక్కడే నియోజకవర్గ ఎన్నికల సిబ్బంది శిక్షణా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను తనిఖీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై సిబ్బందికి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఓటు అనర్హతకు గురికాకుండా సరైన పద్ధతిలో వినియోగించుకునేలా ముందస్తుగా తెలియజేయాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది ఫారం-12 ద్వారా దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఈనెల నాలుగో తేదీ నుంచి నిర్వహించే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ సజావుగా పూర్తి కావాలన్నారు. కలెక్టర్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, శ్రీకాకుళం రిటర్నింగ్ అధికారి సిహెచ్.రంగయ్య, సహాయ రిటర్నింగ్ అధికారి బి.వి.రాణి, ఇతర అధికారులు ఉన్నారు.