ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ ఉక్కు కార్మికులకు తక్షణమే వేతనాలు చెల్లించాలని స్టీల్ప్లాంట్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరాం డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్టీల్ సిఎమ్డి అతుల్బట్ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అయోధ్యరామ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పటికీ స్టీల్ప్లాంట్ కార్మికులకు ఒకటో తేదీన జీతం రాకపోవడం దారుణమన్నారు. ప్రతినెలా జీతాలతో ఇఎంఐలు కట్టేవారు అధిక శాతం ఉన్నారని, 1వ తేదీన జీతాలు పడకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. పిల్లల ఫీజుల నుంచి ఇంటి అద్దెల వరకు అన్ని ఖర్చులూ నెల మొదటి వారంలోనే వస్తాయని యాజమాన్యం గుర్తించి ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని కోరారు. వచ్చే నెల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికుల జీతాలు సమయానికి అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్చేశారు. కార్యక్రమంలో స్టీల్ సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వైటి.దాస్, యు.రామస్వామి, పివిఎస్బి.శ్రీనివాసరాజు, నీలకంఠం, మరిడయ్య, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
![Steel CITU, Vinathi to CMD](https://prajasakti.com/wp-content/uploads/2024/06/1-Steel-citu.jpg)