పాలస్తీనీయుల పక్షానే మేము
కేంద్రానికి తేల్చి చెప్పిన భారత నిర్మాణ కార్మికుల సమాఖ్య
న్యూఢిల్లీ : గాజాలో రక్తపుటేరులు పారిస్తూ, పెద్దయెత్తున మారణ హౌమం సృష్టిస్తున్న ఇజ్రాయిల్లో పనిచేయడానికి మమ్మల్ని పంపిస్తారా? ఆ నెత్తుటి కూడు మాకొద్దు. పాలస్తీనీయుల పక్షానే మేము ఉంటామని భారత నిర్మాణ కార్మికుల సమాఖ్య కేంద్ర ప్రభుత్వానికి శనివారం తేల్చి చెప్పింది. ఇంతవరకు అమెరికా, బ్రిటన్, కొన్ని యూరప్ దేశాల్లోని రక్షణ రంగ పరికరాలు, బాంబులు తయారు చేసే ఫ్యాక్టరీల్లో కార్మికులు, ఇజ్రాయిల్కు ఆయుధాలు ఎగుమతి చేసేందుకు ఓడరేవుల్లో కళాసీలు తిరస్కరించడం చూశాము. ఆ స్పూర్తి ఇప్పుడు భారత్లోనూ వెల్లివిరుస్తోంది. బిజెపి పాలిత రాస్ట్రాలైన హర్యానా, యుపి, గుజరాత్, మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్లలో నిర్మాణ కార్మికరులకు అధిక వేతనాలు ఎరగా వేసి, ఇజ్రాయిల్కు తరలించాలని బిజెపి ప్రభుత్వాలు చేసిన యత్నాలకు భవన నిర్మాణ కార్మికులు ఆదిలోనే గట్టి షాక్ ఇచ్చారు. ఇజ్రాయిల్ నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వేలాదిమంది పాలస్తీనా కార్మికులను నెతన్యాహు ప్రభుత్వం తొలగించింది. గాజాకు చెందిన పాలస్తీనా కార్మికుల వర్క్ పర్మిట్లను రద్దు చేసిన ఇజ్రాయిల్ ప్రభుత్వం పాలస్తీనా వర్కర్ల స్థానంలో దాదాపు లక్ష మంది కార్మికులను భారత్ నుండి తీసుకోవడానికి ఇజ్రాయిల్ చర్యలు తీసుకుంటోందని వార్తలు వచ్చాయి.
ఈ మేరకు బిజెపి పాలనలో వున్న రాష్ట్రాల నుండి నిర్మాణ రంగ కార్మికులను ఇజ్రాయిల్కు పంపేందుకు చర్యలు తీసుకోవాలంటూ హుకుమ్ జారీ చేసినట్టు వార్తలొచ్చాయి.. హర్యానా ప్రభుత్వం పదివేల మంది కార్మికులను రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన కార్మిక సంఘాలు నవంబరు తొలినాళ్ళలో ఒక ప్రకటన కూడా జారీ చేశాయి. పాలస్తీనా కార్మికులను తొలగించి ఆ స్థానంలో భారత్ నుండి కార్మికులను పంపాలనుకోవడం అనైతికమైన చర్య అంటూ విమర్శించాయి. ఇటువంటి చర్య తీసుకుంటే, పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ ఊచకోత చర్యలను సమర్ధించినట్లే అవుతుందని స్పష్టం చేశాయి. భారత ప్రభుత్వం ఇచ్చే కనీస వేతనాల కన్నా అధికంగా 1609 డాలర్ల అధిక నెలవారీ వేతనం ఇస్తామంటూ ఆశ చూపి యుపి నుండి నిర్మాణ రంగ కార్మికులను ఇజ్రాయిల్కు పంపేందుకు ప్రయత్నాలు చేపట్టింది. అయితే, ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే, ఈ వేతనాలేవీ కూడా వెంటనే ఇవ్వరు. కాంట్రాక్టు చివరిలో కార్మికులకు ఇచ్చేలా కాంట్రాక్టు కంపెనీ వద్ద ఈ మొత్తాలను డిపాజిట్ చేస్తారు.
ఈ కాంట్రాక్టు కాల పరిమితి ఏడాది నుండి ఐదేళ్ల మధ్య వుంటుంది. ఇదిలావుండగా, హర్యానా ప్రభుత్వం నుండి కార్మికులను పంపడంపై ప్రకటన రాగానే భారత నిర్మాణ రంగ కార్మికుల సమాఖ్య (సిడబ్ల్యుఎఫ్ఐ) ప్రభుత్వ చర్యలను తీవ్రంగా విమర్శించింది. ఇజ్రాయిల్కు ఇలా నిర్మాణ రంగ కార్మికులను పంపడానికి బదులుగా గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం పిలుపివ్వాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని కోరింది. పాలస్తీనా ప్రజల ప్రయోజనాలకు భారత దేశంలోని నిర్మాణ రంగ కార్మికులు, సమాఖ్య కట్టుబడి వున్నారని, వారికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారని సిడబ్ల్యుఎఫ్ఐ పేర్కొంది.