ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరోమధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రకటనలపై బిజెపి భారీ ఖర్చు చేసింది. ఇటీవల బిజెపి గెలిచిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ కంటే బిజెపి సోషల్ మీడియా ప్రకటనల కోసం చాలా ఎక్కువ ఖర్చు చేసిందని లోక్నీతి-సెంటర్ ఫర్ ది స్టడీ సొసైటీస్ పేర్కొంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఖర్చు చేసిన డబ్బుపై అధ్యయనం చేసింది. రెండు పార్టీల అధికారిక రాష్ట్ర ఖాతాల్లో తేడా స్పష్టంగా కనిపించింది. (వ్యక్తిగతంగా నాయకుల ఖాతాలను, పార్టీ కంటెంట్ను పోస్ట్ చేసే ఇతర అనధికారిక ఖాతాలను లెక్కించలేదు) మధ్యప్రదేశ్లో రెండు పార్టీల మధ్య ఖర్చులో అతి చిన్న తేడా కనిపించింది. ‘మధ్యప్రదేశ్లో ఎన్నికలకు ముందు 90 రోజుల్లో బిజెపి ఖర్చు కాంగ్రెస్ కంటే ఎక్కువ’ అని ది హిందూలో ప్రచురించిన కథనంలో పేర్కొంది. రాష్ట్రంలో బిజెపి రూ.94 లక్షలు ఖర్చు చేయగా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్లో కాంగ్రెస్ రూ.92 లక్షలు ఖర్చు చేసింది. అయితే, ఇవి రాజకీయ ప్రకటనలుగా వర్గీకరించగల కంటెంట్ను పోస్ట్ చేసే ఖాతాలు మాత్రమే కాదు, అలాంటి టాప్ టెన్ ఖాతాలు కలిపి మధ్యప్రదేశ్లో రూ.1.1 కోట్లు ఖర్చు చేసినట్లు అధ్యయనం పేర్కొంది.ఛత్తీస్గఢ్లో ఎన్నికలకు ముందు 90 రోజుల్లో బిజెపి అధికారిక ఖాతా రూ.79.7 లక్షలు ఖర్చు చేయగా, కాంగ్రెస్ రూ.4.7 లక్షలు ఖర్చు చేసింది. రాజస్థాన్లో ఎన్నికలకు 90 రోజుల ముందు బిజెపి రూ.94 లక్షలు, కాంగ్రెస్ రూ.2.18 లక్షలు ఖర్చు చేశాయి. నెగెటివ్ అండర్ టోన్లతో కూడిన ప్రకటనల కోసం కాంగ్రెస్ కంటే బిజెపి ఎక్కువ ఖర్చు చేసిందని అధ్యయనం స్పష్టం చేసింది.