ఏనుగు దాడిలో ఇద్దరు మహిళల మృతి

Feb 19,2024 08:04 #chennai, #elephant, #terror attack

చెన్నై : అడవి ఏనుగు దాడి చేయడంతో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు కృష్ణగిరి జిల్లా డెంకనికొట్టై అటవీ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటనలు జరిగాయి. అన్నీయాలం గ్రామానికి చెందిన వ్యవసాయ కార్మికురాలు వసంతమ్మ (37) పొలంలో పనికి వెళ్లగా, ఏనుగు ఆమెను తొండంతో దూరంగా విసిరివేసింది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. డెంకనికొట్టై రేంజ్‌ ఫారెస్ట్‌ అధికారులు, పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే ఏనుగు సమీపంలోని దాసరపల్లి గ్రామానికి వెళ్లి అక్కడి మహిళ అశ్వతమ్మను తొక్కి చంపేసింది. ఈ ఘటనలపై మృతుల బంధువులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రెండు రోజుల క్రితమే సమాచారం ఇచ్చినా అధికారులు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఏనుగును తరిమివేయాలని, మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

➡️