- ఎన్సి, కాంగ్రెస్ ఉమ్మడిగా బరిలోకి
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్లో ‘ఇండియా’ వేదికలోని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సి), కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. కాశ్మీర్ లోయలోని ఐదు లోక్సభ స్థానాల్లో ఇరువురు పార్టీలు ఉమ్మడిగా అభ్యర్థులను బరిలో నిలుపుతాయని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షులు ఒమర్ అబ్దుల్లా గురువారం తెలిపారు. జమ్ము డివిజన్లోని స్థానాల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ఎన్సి అధ్యక్షులు డాక్టర్ ఫరూఖ్ అబ్దుల్లా ప్రచారం చేస్తారని, అలాగే కాశ్మీర్ లోయలో పోటీ చేసే ఎన్సి అభ్యర్థులకు మద్దతుగా కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తారని ఒమర్ చెప్పారు. దీనిపై త్వరలోనే ఢిల్లీలో ఒక స్పష్టమైన ప్రకటన చేస్తామని ఆయన తెలిపారు. కాగా కాశ్మీర్లోని అన్ని లోక్సభ స్థానాల్లోనూ ఒంటిరిగా పోటీ చేయనున్నట్లు పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పిడిపి) అధినేత్రి మెహబూబా ముఫ్తీ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇండియా వేదికలో పిడిపి కూడా ఒక పక్షంగా ఉంది. అయితే ఒమర్ అబ్దుల్లా వైఖరే ఎన్సి, పిడిపి మధ్య అఘాతానికి కారణమవుతోందని ఆమె విమర్శించారు.