బిజెపిలో చేరిన మరో కాంగ్రెస్‌ మాజీ మంత్రి

Feb 19,2024 17:29 #BJP, #Congress, #ex-Rajasthan minister

 జైపూర్‌ :    వరుసగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు బిజెపిలో చేరుతున్న సంగతి తెలిసిందే. గత పదేళ్లలో తొమ్మిదిమంది మాజీ సిఎంలు ఆ పార్టీని వీడటం గమనార్హం. తాజాగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజస్థాన్‌ మాజీ మంత్రి మహేంద్రజీత్‌ సింగ్‌ మాలవీయ బిజెపిలో చేరారు. సోమవారం ఉదయం బిజెపి కార్యాలయానికి చేరుకున్న ఆయన రాజస్థాన్‌ బిజెపి ఇన్‌ఛార్జ్‌ అరుణ్‌ సింగ్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.  బిజెపి జాతీయ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం తనను ప్రభావితం చేసిందని మాలవీయ పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో బిజెపి చీఫ్‌ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలతో సమావేశమైనట్లు తెలిపారు.

కాగా, మహేంద్రజీత్‌ సింగ్‌ మాలవీయ 2008 నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2008 నుంచి 2013 వరకు, తిరిగి 2021 నుంచి 2023 వరకు మంత్రిగా పనిచేశారు. 1998లో బన్స్వారా నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై లోక్‌సభకు ఎన్నికయ్యారు.

➡️