ముంబై : ఎన్నికల వేళ మహారాష్ట్ర ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. వేర్వేరు కేసుల్లో పది కిలోలకుపైనే బంగారాన్ని, పలు విలువైన వస్తువులను ముంబై కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్రపతి శివాజీ హహారాజ్ ఎయిర్పోర్ట్లో మొత్తం 20 కేసుల్లో 12.74 కిలోల బంగారం పట్టుబడినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. బంగారంతోపాటు ఖరీదైన నాలుగు ఐఫోన్లను (15 ప్రో ఫోన్లను) కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బంగారాన్ని లోదుస్తులు, వాటర్ బాటిల్స్, శరీరంపై దొంగచాటుగా దాచి తరలిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన బంగారం, ఐఫోన్ల విలువ సుమారు రూ.8.37 కోట్లకుపైమాటే అని అంచనా. ఈ మేరకు కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు.. ఐదుగురు ప్రయాణికుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.