రాజ్యసభలో ఆప్ ఎంపి స్వాతి మలివాల్కు ఎదురైన ఘటన
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అన్నందుకు ఒక రాజ్యసభ సభ్యురాలిని రెండోసారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, డిసిడబ్ల్యు మాజీ చీఫ్ స్వాతి మలివాల్కు ఇలాంటి పరిస్థితి ఎదురయింది. రాజ్యసభ సభ్యురాలిగా ఇటీవల ఎంపికైన స్వాతి మలివాల్్ చేత బుధవారం రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్ ఖర్ ప్రమాణ స్వీకారం చేయించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలిరోజు సందర్భంగా ఆమె ప్రమాణస్వీకారం చేసినప్పటికీ, ఒకసారి కాకుండా రెండు సార్లు ప్రమాణం చేయాల్సి వచ్చింది. ఇందుకుకారణంగా తొలుత ప్రమాణ స్వీకారం అనంతరం చివరిలో ఆమె ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అంటూ ముగించడమే. దీనిపై బిజెపి ఎంపి పీయూష్ గోయల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆమె చేసిన ప్రమాణస్వీకారాన్ని చైర్మన్ రద్దు చేశారు. అనంతరం స్వాతి మలివాల్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ రాజ్యసభ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిగా స్వాతి మలివాల్ను ఆ పార్టీ నిలబెట్టగా, ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.