చెన్నై : గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకులు మహ్మద్ జుబేర్కు మత సామరస్యతా పురస్కారాన్ని తమిళనాడు ప్రభుత్వం అందచేసింది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఈ పురస్కారాన్ని ఆయనకు అందచేశారు. కృష్ణగిరి జిల్లా డంకానికొట్టైకి చెందిన జుబేర్ తన ఆల్ట్ న్యూస్ పోర్టల్ ద్వారా సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తల్లో వాస్తవికతలను విశ్లేషిస్తూ కథనాలను రాస్తుంటారు. బూటకపు వార్తల వల్ల సమాజంలో తలెత్తే హింస, ఘర్షణలు వంటి వాటిని నివారించేందుకు ఆయన చేసిన కృషి ఎంతగానో దోహదపడిందని అవార్డు కింద అందచేసిన ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతేడాది మార్చిలో జరిగిన ఒక సంఘటనను ఆ పత్రంలో ఉదహరించారు. తమిళనాడులో వలస వచ్చిన కార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ ఒక బూటకపు వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే ఆ వీడియో ఫుటేజీ వాస్తవమా కాదా అని పరిశీలించి, నిర్ధారించిన తర్వాత ఆయన తన వెబ్సైట్లో ఆ సంఘటన జరిగింది తమిళనాడులో కాదని స్పష్టం చేశారు. ఆ రకంగా తమిళనాడులో హింస తలెత్తకుండా చూశారని పేర్కొన్నారు.