ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిబిఐ, ఇడి విచారణలు ఒకేసారి జరిగినా సిబిఐ కేసుల్లో తీర్పు ఇచ్చిన తరువాతే ఇడి కేసుల్లో తీర్పు ఇవ్వాలని గతంలో హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ.. సిబిఐ విచారణ ముగిసిన తరువాతే ఇడి విచారణ చేపట్టాలని భారతి సిమెంట్, విజయసాయిరెడ్డి, తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఇడి సవాల్ చేసింది. ఈ పిటిషన్పై మంగళవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరిపింది. సిబిఐ కేసుల్లో తీర్పు తరువాతే ఇడి కేసుల్లో తీర్పు ఇవ్వాలా? లేదా? అన్న నిర్ణయాధికారం సిఆర్పిసి సెక్షన్ 309 ప్రకారం ట్రయిల్ కోర్టుకే ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది సుప్రీం ధర్మాసనం. ఈ మేరకు ఆదేశాలిస్తామని పేర్కొంది. ఈలోగా ఈ కేసుతో పాటు వేరే కేసులు కూడా ఉన్నాయని ఇడి తరపు సీనియర్ కౌన్సిల్ తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/23-6.jpg)