న్యూఢిల్లీ : ప్రస్తుత లోక్సభలోని 514 మంది సిట్టింగ్ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయం అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) అధ్యయనంలో వెల్లడైంది. గతంలో ఎంపీలు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించిన ఎడిఆర్ పలు వివరాలతో ఈ నివేదిక విడుదల చేసింది. అలాగే ఈ నివేదిక ప్రకారం.. ఎంపిల్లో 5 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. వీరి ఒక్కొక్కరి సంపద రూ.100 కోట్లకు పైమాటే. క్రిమినల్ కేసులు నమోదైన వారిలో 29 శాతం మందిపై హత్య, హత్యాయత్నం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, కిడ్నాప్, మహిళలపై నేరాలకు పాల్పడటం లాంటి తీవ్రమైన కేసులు ఉన్నాయి. మొత్తం 9 మందిపై హత్య కేసులు నమోదుకాగా.. వారిలో ఐదుగురు బిజెపికకి చెందినవారే. 28 మందిపై హత్యాయత్నం కేసులు నమోదైతే.. వారిలో 21 మంది బిజెపికి చెందినవారే కావడం గమనార్హం. మహిళలపై నేరాలకు సంబంధించి 16 కేసులు, 3 అత్యాచారం కేసులు నమోదయ్యాయి.
అలాగే కోటీశ్వర్లలో ఎక్కువ మంది బిజెపి, కాంగ్రెస్లకు చెందినవారే. ధనిక ఎంపీల్లో కాంగ్రెస్కు చెందిన నకుల్నాథ్ ప్రథమ స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో డీకే సురేశ్ (కాంగ్రెస్), కనుమూరు రఘురామ కృష్ణరాజు ఉన్నారు. ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎంపీలపైనే ఎక్కువగా క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ విశ్లేషణలో తేలింది. ఆయా రాష్ట్రాల్లో సగానికిపైగా ఎంపీలపై కేసులున్నాయి. ఎంపీల విద్యార్హతలను కూడా ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది. 73శాతం మంది ఎంపీలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు వెల్లడించింది.