న్యూఢిల్లీ : ” అదనపు సమయాన్ని ఇవ్వలేం.. ఎన్నికల బాండ్ల వివరాలను రేపటిలోగా వెల్లడించాల్సిందే ” అని సర్వోన్నత న్యాయస్థానం ఎన్నికల బాండ్ల వ్యవహారంలో ఎస్బిఐ కు కీలక ఆదేశాలను జారీచేసింది. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడి చేయడానికి గడువును జూన్ 30 వరకూ పొడిగించాలంటూ ఎస్బిఐ దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. బాండ్ల వివరాలను వెల్లడించాల్సిందేనని, అదనపు సమయాన్ని ఇవ్వలేమని స్పష్టం చేసింది.
ఎన్నికల బాండ్ల రద్దు ప్రక్రియకు విఘాతం కలిగించడానికి స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ఐబి) ద్వారా బిజెపి ప్రభుత్వం కొత్త నాటకాలు ఆడుతోందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల బాండ్లను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించిన సర్వోన్నత న్యాయస్థానం ఆ బాండ్లు ఎవరెవరు కొన్నారు.. ? ఎవరికి ఇచ్చారు అనే అంశాలతో పూర్తి వివరాలను మార్చి 6లోగా ఎన్నికల సంఘానికి నివేదించాలని, ఎన్నికల సంఘం మార్చి 13 కల్లా వాటిని ప్రచురించాలని ఈ ఏడాది ఫిబ్రవరి 14న ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఈ గడువు బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో … చివరాఖరులో గత సోమవారం మరింత గడువు కావాలంటూ ఎస్బిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
- సిపిఎం హర్షం
సుప్రీం కోర్టు రేపటిలోగా ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలని, అదనపు సమయం కేటాయించలేమని ఎస్బిఐకి ఆదేశాలు ఇవ్వడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై స్పందించిన సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సుప్రీం కోర్టు కోరిన విధంగా వివరాలు బయట పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మరింత సమాచారం కోసం ఈ లింక్పై క్లిక్ చేయగలరు..
https://prajasakti.com/varthalu/national/disruption-of-cancellation-of-election-bonds/