నిజనిర్ధారణ కమిటీ సభ్యులను అరెస్ట్‌ చేసిన బెంగాల్‌ పోలీసులు

 కోల్‌కతా :    సందేశ్‌ఖలీ వెళ్తున్న నిజనిర్థారణ కమిటీ సభ్యులను ఆదివారం బెంగాల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పశ్చిమబెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భోజెర్‌హట్‌లో వారిని అదుపులోకి తీసుకున్నారు. కమిటీలోని ఆరుగురు సభ్యులను అరెస్ట్‌ చేశారని, అరెస్ట్‌ తర్వాత వారిని పిహెచ్‌క్యూ సభ్యులను లాల్‌బజార్‌ కోల్‌కతాకు తరలించినట్లు తెలుస్తోంది.  ఈ కమిటీలో  ఒపి వ్యాస్‌, పాట్నా హైకోర్టు మాజీ సిజె జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి, మాజీ ఐపీఎస్‌ అధికారి రాజ్‌పాల్‌సింగ్‌, నేషనల్‌ ఉమెన్‌ కమిషన్‌ మాజీ సభ్యురాలు చారు వలి కన్నా, న్యాయవాది భావ్‌నా బజాజ్‌లు ఉన్నారు. పోలీసుల అరెస్టును ఖండిస్తూ నిజనిర్ధారణ కమిటీ సభ్యులంతా ధర్నా చేపట్టారు.తాము సందేశ్‌ఖలీకి వెళ్లి బాధిత మహిళలతో మాట్లాడాలనుకున్నామని, కానీ పోలీసులు వెళ్లనివ్వకుండా తమని అరెస్ట్‌ చేశారని నిజనిర్థారణ కమిటీ సభ్యురాలు చారుకన్నా తెలిపారు. సెక్షన్‌ 144ను ఉల్లంఘించబోమని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని అన్నారు.

బోజెర్‌హట్‌ దాటి వెళ్లవద్దని కమిటీ సభ్యులను అభ్యర్థించామని, కానీ వారు చట్ట విరుద్ధంగా బారికేడ్‌ను బద్దలు కొట్టేందుకు యత్నించారని కోల్‌కతా పోలీస్‌, భాంగర్‌ డివిజన్‌, డిప్యూటీ కమిషనర్‌ సైకత్‌ ఘోష్‌ పేర్కొన్నారు. శాంతికి విఘాతం కలిగిస్తున్నారన్న కారణంతో ముందస్తు అరెస్టు చేసినట్లు తెలిపారు. కాగా, పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలీలో టీఎంసీ నేత షాజహాన్‌ షేక్‌, అతని అనుచరులు తమపై లైంగిక దాడులు చేసేందుకు, తమ భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని అక్కడి మహిళలు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే.

➡️