- కొండచరియలు విరిగిపడి తల్లీబిడ్డల దుర్మరణం
- పలుచోట్ల ట్రాఫిక్కు అంతరాయం
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో ఇల్లు కూలి, ఆ ఇంటిలో నిద్రిస్తున్న మహిళ, ఆమె ముగ్గురు కుమార్తెలు ప్రాణాలు కోల్పోయారు. జమ్ముకాశ్మీర్లోని రియాసీ జిల్లా మహౌర్ సబ్ డివిజన్ చస్సాన తహసీల్లోని కుందర్ధన్ మోహ్రా గ్రామంలో ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఫల్లా అఖ్తర్ (30), ఆమె కుమార్తెలు నసీమా (5), సఫీనా కౌసర్ (3), సమ్రీన్ కౌసర్ (3) మరణించినట్లు చెప్పారు. అదే ఇంటిలో ఉన్న వృద్ధులు ఖలు, అతని భార్య భానోబేగం తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి గాయపడిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజులుగా భారీ వర్షాలుజమ్ముకాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో మూడు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన గాలులు, వడగళ్ల వాన, కొండ చరియలు విరిగిపడటంతో పలు ప్రాంతాల్లో నివాస గృహాలతోసహా పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. కొండచరియలు విరిగిపడటంతో జమ్ము – శ్రీనగర్ హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది.