లక్నో : జ్ఞానవాపి మసీదులో బేస్మెంట్లో పూజలు చేసేందుకు హిందువులను బుధవారం వారణాసి కోర్టు అనుమతించింది. విశ్వనాధుని ఆలయం నుండి పూజారులు పూజలు నిర్వహించవచ్చని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. మసీదు బేస్ మెంట్ లోకి ప్రవేశించకుండా నిరోధించే బారికేడ్లను తొలగించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) సర్వే సమయంలో ఈ ప్రాంతంలోకి ప్రవేశించకుండా బారికేడ్లను ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
కోర్టు ఆదేశాల మేరకు 1993కి ముందు తరహాలోనే బేస్మెంట్లో పూజలకు వెళ్లేందుకు అనుమతించాలని హిందూ పిటిషనర్ల తరుపు న్యాయవాదులు కోర్టును కోరారు. దీనిపై ఇంతేజామియా మసీదు కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బేస్మెంట్ మసీదులో భాగమని స్పష్టం చేశారు. అక్కడ పూజలు చేయడానికి వీలు లేదన్నారు. బేస్మెంట్ మసీదులో భాగమని, అది వక్ఫ్బోర్డు ఆస్తి అని పేర్కొన్నారు. అక్కడ పూజలు చేయకూడదని వాదించారు.