భోపాల్ : తాను బిజెపిలో చేరడం లేదని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ తెలిపారు. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు మూడు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సోమవారం ఆయన స్పందించారు. న్యూఢిల్లీలోని నివాసంలో తన మద్దతుదారులతో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రకటించారు. కమల్ నాథ్ బిజెపిలో చేరడం లేదని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ ఆదివారం తెలిపారు. కమల్నాథ్ చింధ్వారా నుంచి తొమ్మిది సార్లు ఎంపీగా చేశారు. ప్రస్తుతం అదే చింధ్వారా ఎమ్మెల్యేగా ఉన్నారు. గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలోనే కుమారుడితో కలిసి ఆయన బిజెపిలో చేరబోతున్నారంటూ ప్రచారం జరిగింది.