న్యూఢిల్లీ : ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ నేతలు మంగళవారం నాలుగోసారి సమావేశమయ్యారు. స్థానిక అశోక్ హోటల్లో నేతలంతా భేటీ అయ్యారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎన్సిపి అధ్యక్షుడు శరద్ పవార్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, శివసేన (యుటిబి) ఉద్ధవ్ థాకరేలు హాజరయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని గద్దె దించడమే లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. సీట్ల పంపకం ప్రధానాంశంగా నేడు చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. మొదట డిసెంబర్ ఆరున సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. అయితే మమతా బెనర్జీ, స్టాలిన్, సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్లు అందుబాటులో లేకపోవడంతో సమావేశం వాయిదా పడింది.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/india-4.jpg)