చండీగఢ్ : రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ హర్యానా మాజీ డిప్యూటీ సిఎం దుష్యంత్ చౌతాలా గురువారం గవర్నర్కు లేఖ రాశారు. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు పాలక బిజెపి కూటమికి మద్దతు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ముగ్గురు ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వం మైనారిటీలో పడిందని, దీంతో ఆయన ప్రభుత్వం తక్షణమే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని జననాయక్ జనతా పార్టీ (జెజెపి) నేత దుష్యంత్ చౌతాలా గవర్నర్ బండారు దత్తాత్రేయకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం తీసుకువస్తే .. దానికి మద్దతిస్తామని అన్నారు. విశ్వాస పరీక్షలో ప్రభుత్వం మెజారిటీ సాధించలేకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని చౌతాలా పేర్కొన్నారు.
90 సీట్లు కలిగిన హర్యానా అసెంబ్లీలో ప్రస్తుతం 88 మంది సభ్యులు ఉన్నారు. మెజారిటీ మార్క్ 45 కాగా, బిజెపికి 40 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు.