బెంగళూరు : పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనకు సంబంధించి కర్ణాటకకు చెందిన మాజీ పోలీస్ అధికారి కుమారుడు అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు గురువారం తెలిపారు. ఇంజనీర్ అయిన సాయికృష్ణ జాగాలిని బాగల్కోట్లోని ఆయన నివాసం నుండి బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నామని అన్నారు. అతనిని ఢిల్లీకి తీసుకురానున్నట్లు సమాచారం.
సాయికృష్ణ లోక్సభలోకి చొరబడి రంగు పొగను వదిలిని ఇద్దరు నిందితుల్లో ఒకరైన మనోరంజన్ స్నేహితుడని పోలీసులు పేర్కొన్నారు. ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద అభియోగాలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితుల్లో మనోరంజన్ కూడా ఉన్నారు. సాయికృష్ణ, మనోరంజన్లు బెంగళూరులోని ఇంజినీరింగ్ కాలేజీలో బ్యాచ్మేట్స్గా ఉన్నారు. విచారణలో భాగంగా మనోరంజన్ చెప్పిన వివరాల ఆధారంగా సాయికృష్ణ అదుపులోకి తీసుకున్నామని అన్నారు.
ఈ ఘటనపై సాయికృష్ణ సోదరి స్పందించారు. ”ఢిల్లీ పోలీసులు వచ్చిన మాట వాస్తవమే. నా సోదరుడిని ప్రశ్నించారు. ఈ విచారణకు మేం పూర్తిగా సహకరించాం. సాయికృష్ణ ఎలాంటి తప్పు చేయలేదు. గతంలో సాయికృష్ణ, మనోరంజన్ రూమ్మేట్స్. ఇప్పుడు నా సోదరుడు వర్క్ఫ్రమ్ హోమ్లో చేస్తున్నాడు” అని అన్నారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశారు.