న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలోని అంబేద్కర్ కాలేజీ సమీపంలో నిన్న అర్థరాత్రి 1.30 గంటల సమయంలో ఎన్కౌంటర్ కలకలం రేపింది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు గ్యాంగ్స్టర్లు అరెస్టయ్యారు.
పోలీసుల కథనం మేరకు … హాశిమ్ ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులు మార్చి 9వ తేదీన అర్బాజ్ అనే వ్యక్తిని కాల్చి చంపారు. ఆ ముగ్గురి కదలికలపై పోలీసులకు సోమవారం సమాచారం అందడంతో వారిని పట్టుకోవడానికి వెళ్లగా.. గ్యాంగ్స్టర్లు కాల్పులకు తెగబడ్డారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దుండగుల్లో పలువురి కాళ్లకు గాయాలయ్యాయి. ముగ్గురు గ్యాంగ్స్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించినట్లు డీసీపీ జారు టిర్కీ తెలిపారు. హత్య, హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని వివరించారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు సైతం స్వల్ప గాయాలయ్యాయి.