యూసఫ్‌ పఠాన్‌, రచనకు లోక్‌సభ సీట్లు

టిఎంసి లోక్‌సభ అభ్యర్థుల జాబితా
కోల్‌కతా: త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పశ్చిమ బెంగాల్‌లో టిఎంస ఆదివారం అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. బహరామ్‌పుర్‌ నుంచి మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌ బరిలో దిగనున్నారు. హుగ్లీ నుంచి నటి రచనా బెనర్జీకి అవకాశం కల్పించారు. ఆమె తెలుగులో బావగారు బాగున్నారా?, కన్యాదానం, మావిడాకులు చిత్రాల్లో నటించారు. అవినీతి ఆరోపణలపై పార్లమెంటు సభ్యత్వం కోల్పోయిన మహువా మొయిత్రా మరోసారి కృష్ణానగర్‌ నుంచి పోటీ చేయనున్నారు. ఎనిమిది మంది సిటింగ్‌లను పక్కకు తప్పించారు. ఆదివారం నుంచి కోల్‌కతా వేదికగా ఎన్నికల ప్రచారాన్ని టిఎంసి చీఫ్‌ మమతా బెనర్జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ జాబితాను ప్రకటించారు. ‘ఇండియా’ వేదికలో భాగమైనప్పటికీ.. రాష్ట్రంలో ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. మొత్తం 42 స్థానాలకుగానూ అభ్యర్థులను ప్రకటించారు.ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక స్థానం నుంచి పోటీకిగానూ సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో చర్చలు జరుపుతున్నట్లు మమతా తెలిపారు. అస్సాం, మేఘాలయాలోనూ పోటీ చేస్తామన్నారు.

➡️