- నిరుద్యోగ యువత ఆకాంక్షలు లేవు
- ‘సంకల్ప్ పత్ర’ పేరుతో 2024 మేనిఫెస్టో విడుదల
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అన్నదాతలకు గతంలో వాగ్ధానం చేసిన కనీస మద్దతు ధర (ఎంఎస్పి) ఉసే లేకుండా బిజెపి తన ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం నాడిక్కడ విడుదల చేసింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గత సారి ఎన్నికల్లో హామీ ఇచ్చిన బిజెపి ఈ సారి దీనిపై పూర్తిగా మౌనం వహించింది. రైతుల సంక్షేమమే ధ్యేయమని రొటీన్ డైలాగులు వల్లించింది. అలాగే దేశం ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య నిరుద్యోగం గురించి పట్టించుకోలేదు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన బిజెపి ఈసారి యువతను మభ్య పెట్టే మాటలతో సరిపుచ్చింది. సంకల్ప్ పత్ర’ పేరుతో 14 అంశాలతో కూడిన బిజెపి మేనిఫెస్టోను ఆదివారం ఇక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, బిజెపి ఆలోచన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమేనని అన్నారు. తమ పాలనలో అభివృద్ధి, సంస్కృతికి రెండింటికీ ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. మానవ కల్యాణం, ప్రపంచ హితం కోసం ఎప్పుడూ ముందుంటామని అన్నారు.దేశాభివృద్ధికి అవినీతి ఆటంకంగా మారిందన్నారు. నాలుగు స్తంభాలతో సంకల్ప్ పత్రకు పునాదులు వేశామన్నారు. యువశక్తి, నారీశక్తి, గరీబ్, కిసాన్ను దృష్టిలో ఉంచుకుని దీనిని తయారు చేశామని తెలిపారు. బిజెపి, ఆరెస్సెస్ మతతత్వ ఎజెండాలో భాగమైన యుసిసిని అమలు చేస్తామని ఈ మ్యానిఫెస్టోలో గొప్పగా ప్రకటించింది. అలాగే వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొస్తామని చెప్పింది. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామని బిజెపి మేనిఫెస్టోలో పేర్కొంది. పెట్రోల్ ధరలు తగ్గిస్తామని, పెట్రోలు వినియోగాన్ని అవకాశం ఉన్నంత మేరకు తగ్గిస్తామని తెలిపింది. 2036లో ఒలింపిక్స్ దేశంలో నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తామని పేర్కొంది. ”ఉచిత రేషన్ను వచ్చే ఐదేళ్లు కూడా అందిస్తాం. 70 ఏళ్లు పైబడిన వృద్ధులనూ ఆయుష్మన్ భారత్లో చేరుస్తాం. రూ.5 లక్షల ఉచిత వైద్యం అందిస్తాం. పేదలకు మూడు కోట్ల ఇళ్లు కట్టించి ఇస్తాం. దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం చేపడతాం. సీనియర్ సిటిజెన్లతో పాటు ట్రాన్స్జెండర్లకూ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేస్తాం. భవిష్యత్తులో పైపులైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ అందిస్తాం. పిఎం సూర్య ఘర్ పథకం ద్వారా లబ్ధిదారులు తమ ఇంట్లో తయారైన కరెంటును అమ్ముకోవచ్చు. ముద్ర పథకం కింద ఇచ్చే రుణాన్ని రూ.20 లక్షలు చేస్తాం. చిరు వ్యాపారులకు వడ్డీల బాధ తొలగిస్తాం” అని పేర్కొన్నారు.
”వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేస్తాం. డెయిరీ సహకార సంఘాల సంఖ్య పెద్ద సంఖ్యలో పెంపు. కూరగాయల సాగు, వాటి నిల్వ కోసం కొత్త క్లస్టర్లు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం పెంచుతాం. భారత్ను గ్లోబల్ న్యూటిషన్ హబ్గా మారుస్తాం. శ్రీ అన్న్ రకం పండించడం ద్వారా రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. సముద్ర నాచు, ముత్యాల సాగు దిశగా మత్స్యకారులను ప్రోత్సహిస్తాం. భారత్ను ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా మారుస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల గ్రామాల ఆదాయం పెరుగుతుంది. నానో యూరియా వినియోగం మరింత పెంచుతాం” అని అన్నారు.
”భారత్ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుస్తాం. ఏజెన్సీల్లో పర్యాటకం ప్రోత్సహించి గిరిజనులకు మేలు చేస్తాం. ‘సోషల్, డిజిటల్, ఫిజికల్ రంగాల్లో మౌలిక వసతులు పెంచుతాం. దేశంలో అనేక చోట్ల శాటిలైట్ పట్టణాలు నిర్మిస్తున్నాం. విమానయాన రంగాన్ని ప్రోత్సహించి లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాం. త్వరలో వందే భారత్ స్లీపర్, వందే భారత్ మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తాయి. దేశం నలుమూలల బుల్లెట్ రైళ్లు తెస్తాం. దక్షిణ, ఉత్తర, తూర్పు వైపు కూడా బుల్లెట్ రైలు మార్గాలు వేస్తాం. భారత్ను గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్, సెమీ కండక్టర్ హబ్గా మారుస్తాం” అని అన్నారు.
సంకల్ప్ పత్రలోని 14 అంశాలు..
1. విశ్వబంధు, 2. సురక్షిత భారత్, 3.సమృద్ధ భారత,్ 4. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, 5. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, 6. ఈజ్ ఆఫ్ లివింగ్, 7 సాంస్కృతిక వికాసం, 8.గుడ్ గవర్నెన్స్, 9.స్వస్థ భారత్, 10. అత్యుత్తమ శిక్షణ, 11. క్రీడా వికాసం, 12. సంతులిత అభివృద్ధి, 13. సాంకేతిక వికాసం., 14. సుస్థిర భారత్
ఇది జుమ్లా పత్రం : ప్రతిపక్షాల విమర్శ
ఇది సంకల్ప్ పత్రం కాదు, జుమ్లా పత్రం (అబద్ధాల పత్రం) అని ప్రతిపక్షాలు విమర్శించాయి.ప్రధాని ఇచ్చిన గ్యారంటీలు వట్టి అబద్ధాలేనని ప్రతిపక్ష నాయకులు పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో అధికారంలో ఉండి కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చని బిజెపి ఇప్పుడు ఉత్తుత్తి హామీలతో మరోసారి ప్రజలను మోసగించాలని చూస్తోందని వారు అన్నారు.