లక్నో : నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని కాలేరని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లో ఇండియా బ్లాక్ తుఫాన్ సృష్టిస్తుందని అన్నారు. సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న కన్నౌజ్ నియోజకవర్గంలో శుక్రవారం నిర్వహించిన భారీ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడారు. యుపిలో ఇండియా బ్లాక్ తుఫాన్ రాబోతుందని, రాష్ట్రంలో బిజెపి అతిపెద్ద ఓటమిని ఎదుర్కోబోతోందని అన్నారు. మోడీ భారత్కు ప్రధాని కాలేరని అన్నారు. అఖిలేష్ యాదవ్ సహా ఆప్ నేత సంజయ్ సింగ్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ఇండియా బ్లాక్లో కాంగ్రెస్, ఎస్పిలు యుపిలో సీట్ల ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా కన్నౌజ్ నుండి అఖిలేష్ యాదవ్ బరిలోకి దిగారు. ఈ నియోజకవర్గంలో మే 13న పోలింగ్ జరగనుంది.