- మరో ముగ్గురిపై సస్పెన్షన్ వేటు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : లోక్సభలో ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ల పర్వం చివరి రోజు గురువారం కూడా కొనసాగింది. తాజాగా మరో ముగ్గురు ఎంపిలపై సస్పెన్షన్ వేటు వేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపిలు దీపక్ బైజ్, డికె సురేశ్, నకుల్ నాథ్పై స్పీకర్ ఓం బిర్లాలను ఈ శీతాకాల సమావేశాల మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో లోక్సభ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎంపిల సంఖ్య మొత్తం 100కి చేరింది. అలాగే, ఉభయ సభల్లో కలిపి ఆ సంఖ్య 146కు చేరుకుంది. మరోవైపు, లోక్సభ నిరవధికంగా వాయిదా పడింది. పలు బిల్లులకు ఆమోదం తెలిపిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కన్నా ఒకరోజు ముందుగానే లోక్ సభ సమావేశాలను ముగించారు.
తొలుత.. గురువారం లోక్సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే.. పెద్ద సంఖ్యలో ప్రతిపక్ష ఎంపిలను సస్పెండ్ చేయడంపై ఈ ముగ్గురు ఎంపిలు నిరసన తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభలో ప్లకార్డులు ప్రదర్శించడంతో పాటు వెల్లోకి దూసుకెళ్లారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా వారికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా వినకపోవడంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ ముగ్గురు ఎంపిల సస్పెన్షన్ కు సంబంధించి తీర్మానం చేయడంతో ఈ ముగ్గురు ఎంపిలపై వేటు పడింది.
ప్రతిపక్షాల నిరసన ర్యాలీ
ప్రస్తుతం పార్లమెంట్ సెషన్లో 143 మంది ప్రతిపక్ష ఎంపిలపై మూకుమ్మడి సస్పెన్షన్లపై గురువారం ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపిలు నిరసన ర్యాలీ చేపట్టారు. పార్లమెంట్ భవనం నుంచి సెంట్రల్ ఢిల్లీలోని విజయ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాసిన బ్యానర్, ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు హౌరెత్తించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ బిజెపికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని ఆయన విమర్శించారు. ”భద్రతా వైఫల్యంపై చర్చించడానికి అనుమతి ఇవ్వాలని లోక్సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ ను కోరుతున్నాం.
ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా దీనిపై పార్లమెంట్లో ప్రకటన చేయాలి. లోక్సభలో మినహా బయట మీడియాతోనూ, సభల్లోనూ ప్రధాని మోడీ దీని గురించి మాట్లాడారు. భద్రతా వైఫల్యం ఘటన ఎందుకు జరిగింది..? ఎవరు బాధ్యులు..?” అని ఖర్గే ప్రశ్నించారు. ప్రతిపక్షాల’ఇండియా’ ఫోరం సభ్యులు శుక్రవారం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టనున్నారని ఆయన చెప్పారు.