ముంబై : లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రధాన ప్రతిపక్ష, అధికార పార్టీలైన కాంగ్రెస్, బిజెపి రెండు పార్టీల్లోనూ సీనియర్ నేతలు చేరుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత పద్మాకర్ వాల్వి బుధవారం బిజెపిలోకి చేరారు. బుధవారం ముంబైలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే, ఇటీవలే ఆ పార్టీలోకి చేరిన మహారాష్ట్ర మాజీ సిఎం, మాజీ కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ నేతృత్వంలో పద్మాకర్ వాల్వి బిజెపిలోకి చేరారు.
కాగా, కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యారు యాత్ర’ గురువారం మహారాష్ట్రలోని నందర్బార్కు చేరుకోనుంది. ఈ సమయంలోనే పద్మాకర్ బిజెపిలోకి చేరి కాంగ్రెస్కు షాక్ ఇచ్చారు. నందార్బర్ నియోజకవర్గం నుంచి పద్మాకర్ వాల్వి కాంగ్రెస్ టికెట్పై మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ జిల్లాల్లో గిరిజనులు అధికంగా ఉంటారు. ఇక వాల్వి ఉత్తర మహారాష్ట్రలో బలమైన నాయకుడిగా పేరొందారు. ఎన్సిపి- కాంగ్రెస్ల ప్రభుత్వ హయాంలో పద్మాకర్ మంత్రిగా కూడా పనిచేశారు. గతకొన్ని వారాల క్రితం కాంగ్రెస్ సీనియర్ నేత బసవరాజ్ పాటిల్ కూడా బిజెపిలోకి చేరారు. గత నెల (ఫిబ్రవరి 21)లో మహారాష్ట్ర మాజీ సిఎం అశోక్చవాన్ కూడా బిజెపిలోకి చేరిన సంగతి తెలిసిందే.