ముంబయి : మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపి (ఎస్పి) బుధవారం విడుదల చేసింది. మహారాష్ట్ర శాసనమండలి సభ్యులు శశికాంత్ షిండే సతారా లోక్సభ స్థానం నుండి పోటీ చేయనున్నారు. జల్గావ్లోని రావర్ స్థానం నుండి వ్యాపారవేత్త శ్రీరామ్ పాటిల్ బరిలోకి దిగనున్నట్లు ఎన్సిపి ప్రకటించింది. శ్రీరామ్ పాటిల్ బిజెపి నేత ఏకనాథ్ ఖడ్సే కోడలు రక్షా ఖడ్సేపై పోటికి దిగనున్నారు.
ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, బిజెపి, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపిలతో కూడిన మహారాష్ట్ర అధికార కూటమి సతారా నుండి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.
తాజా అభ్యర్థుల ప్రకటనతో ఎన్సిపి (ఎస్పి) వచ్చేలోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న పది స్థానాల్లో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మాదా లోక్సభ స్థానం నుండి అభ్యర్థిని ప్రకటించాల్సి వుంది.