- విద్యా వినాశకర విధానాలపై ఐక్యపోరు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : విద్యారంగంలో మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధ్వంసకర చర్యలకు వ్యతిరేకంగా శుక్రవారం ఎస్ఎఫ్ఐతో సహా 16 విద్యార్థి సంఘాలు చలో పార్లమెంటు ప్రారంభమైంది. జంతర్ మంతర్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించనున్నాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థి నేతలు, కార్యకర్తలు దేశ రాజధానికి చేరుకున్నారు. మోడీ సర్కార్ విద్యా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త ఉద్యమం చేపట్టాలని దేశంలోని అన్ని ప్రధాన విద్యార్థి సంస్థల ఉమ్మడి వేదిక ‘యునైటెడ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా’ నిర్ణయించింది. ‘సేవ్ ఎడ్యుకేషన్, రిజెక్ట్ ఎన్ఇపి, సేవ్ ఇండియా, రిజెక్ట్ బిజెపి’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా విద్యార్థులను ఈ ఉద్యమం చైతన్యవంతం చేస్తుంది. ఉద్యమంలో భాగంగా రాజధాని ఢిల్లీలో విద్యార్థుల భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూక్ బిస్వాస్ తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఆందోళనలో దేశంలోని అన్ని ప్రధాన విద్యార్థి సంఘాల జాతీయ నాయకత్వం హాజరవుతుందన్నారు.