ఆప్ తరపున ప్రచారం చేయనున్న సునీతా కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ :  లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ పార్టీ తరపున ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ భార్య సునీత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 27న ఈస్ట్‌ ఢిల్లీ నియోజకవర్గంలో రోడ్‌షో ద్వారా ఆమె తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారని ఢిల్లీ మంత్రి అతిషి శుక్రవారం ప్రకటించారు. సునీతా కేజ్రీవాల్‌ ఢిల్లీ ప్రజల నుండి ఓట్లను, ఆశీర్వాదాలను కోరతారని అన్నారు. ఆప్‌ తరపున ఢిల్లీ, పంజాబ్‌, గుజరాత్‌, హర్యానాల్లో ప్రచారం చేపడతారని అన్నారు. శనివారం ఈస్ట్‌ ఢిల్లీలో  మొదటి రోడ్‌ షో నిర్వహిస్తారని,  వెస్ట్‌ ఢిల్లీలో ఆదివారం మరో రోడ్‌షో నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పొత్తుతో ఆప్‌ పోటీ చేస్తోంది. ఈస్ట్‌ ఢిల్లీ, వెస్ట్‌ ఢిల్లీ, సౌత్‌ ఢిల్లీ, న్యూఢిల్లీ స్థానాలకు ఆప్‌ తన అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్‌ నార్త్‌ఈస్ట్‌ ఢిల్లీ, నార్త్‌ వెస్ట్‌ ఢిల్లీ, చాందినీ చౌక్‌ సీట్లలో పోటీ చేస్తోంది.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ ఆరోపణలపై  మార్చి 21న అరెస్టయిన కేజ్రీవాల్‌ ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్నారు. కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు మరో 14 రోజుల పాటు పొడిగించిన సంగతి తెలిసిందే.

➡️