పాకుర్ : జార్ఖండ్ రాజకీయాలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జై రాం రమేష్ బిజెపి ‘అస్థిరత రాజకీయం’ చేస్తోందని ధ్వజమెత్తారు. తాజాగా మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమెంత్ సోరెన్న్ ఇడి అరెస్టు చేసింది. ఆయన స్థానంలో చంపాయి సోరెన్ సిఎంగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల నెలకొన్న ఈ రాజకీయ పరిణామాలపై జైరాం రమేష్ మాట్లాడుతూ.. ‘మొదట బిజెపి మహారాష్ట్రలో శివసేన పార్టీని చీల్చింది. ఆ తర్వాత ‘ఇండియా’ వేదికలో అగ్రనాయకులైన నితీష్కుమార్ని యూటర్న్ అయ్యేలా చేసింది. ఇప్పుడు ఇడి, సిబిఐ దర్యాప్తు సంస్థల ప్రయోగంతో జార్ఖండ్లో హేమంత్ సోరెన్ని అరెస్టు చేషశారు. బిజెపి చేస్తున్నది అస్థిరత రాజకీయం. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర, ఇండియా వేదికల ఏర్పాటుతో బిజెపి అయోమయంలో పడింది.’ అని ఆయన అన్నారు.
కాగా, జార్ఖండ్లో చంపాయి సోరెన్ నూతన ప్రభుత్వం ఫిబ్రవరి 5న బల పరీక్ష ఎదుర్కోనుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు జెఎంఎం పార్టీకి మద్దతుగా నిలిచారు. ఆ రాష్ట్రంలో 81 మంది ఎమ్మెల్యేల్లో బిజెపికి 26 మందే ఉన్నారు. దీంతో బలపరీక్షల్లో కాంగ్రెస్ పార్టీతోపాటు, ఇతర పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో చంపాయి సోరెన్ ప్రభుత్వం విజయం సాధిస్తుందని ఈ కూటమి నమ్మకంతో ఉంది.