కాంగ్రెస్‌ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు : కర్ణాటక ముఖ్యమంత్రి 

Dec 10,2023 16:02 #Congress, #Karnataka, #Siddaramaiah

బెంగళూరు :   కేవలం కాంగ్రెస్‌ని మాత్రమే ఎందుకు  టార్గెట్ చేస్తున్నారని  కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్రాన్ని నిలదీశారు. బిజెపి నేతలపై కూడా ఐటి దాడులు చేపట్టాలని  సూచించారు.   కాంగ్రెస్‌ ఎంపి ధీరజ్‌ సాహూ నివాసం నుండి ఆదాయపుపన్ను శాఖ (ఐటి) ఇటీవల దాడులు నిర్వహించడంపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ” బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేవలం కాంగ్రెస్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారు. బిజెపి నేతలపై కూడా దాడులు చేయనివ్వండి. అప్పుడే వారి వద్ద ఎంత అక్రమ సంపాదన ఉందో తెలుస్తుంది. ఐటి చట్ట ప్రకారం.. నల్లధనం ఎవరు దాచినా అది తప్పే. బిజెపి నేతలపై కూడా చర్యలు తీసుకోనివ్వండి ” అని అన్నారు. బిజెపినేతలపై దాడులు చేపట్టినా భారీగా నగదు పట్టుబడుతుందని అన్నారు.

గత ఐదు రోజులుగా కాంగ్రెస్‌ ఎంపి ధీరజ్‌ సాహూ నివాసాలు, ఇతర సంస్థలపై ఐటి అధికారులు దాడులు చేపడుతున్నసంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ దాడుల్లో సుమారు రూ. 290 కోట్లను జప్తు చేసినట్లు ఐటి అధికారులు తెలిపారు. ఒకే ఆపరేషన్‌లో జప్తు చేసిన నల్లధనంలో అత్యధిక మొత్తం ఇదేనని అన్నారు.

➡️