ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం): ప్రయివేటుపరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నుతోన్న కుట్రలకు వైజాగ్ స్టీల్ప్లాంట్ బలవుతోందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు యు.రామస్వామి అన్నారు. స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారానికి 1078వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్ టిపిపి, ఆర్ఇడి స్టోర్స్, పిఇఎం విభాగాల ఉద్యోగులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ స్టీల్ప్లాంట్లో ఒక్కో విభాగాన్నీ నిర్వీర్యం చేస్తూ ముందుకు వెళ్తున్నారన్నారు. ఉత్పత్తికి అవరోధాలు సృష్టిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కుటిలయత్నాలను కార్మికులు తిప్పికొడుతున్నారని అన్నారు. వైసిపి, టిడిపి, జనసేనల నుంచి వారికి సహకారం అందడంలేదని తెలిపారు. మోడీ సర్కారును ఎదిరించి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునేందుకు ఆయా పార్టీలు ముందుకు రావడం లేదని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ప్లాంట్ను కాపాడేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.