ఓటర్ల కోసం కొత్త మొబైల్‌ యాప్‌ లాంచ్‌ చేసిన ఎన్నికల కమీషన్‌

హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైంది. లోక్‌ సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో రాజకీయ పార్టీల్లో టెన్షన్‌ వాతావరణం కనబడుతోంది. ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారని జనాలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఎన్నికల కమిషన్‌ ఓ కొత్త మొబైల్‌ యాప్‌ ను తీసుకువచ్చింది. అభ్యర్థుల ప్రొఫైల్‌ తో పాటు అతడు, ఆమెపై ఉన్న వివిధ కేసులు, నేర చరిత్ర వివరాలను ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. వాస్తవానికి లోక్‌ సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందే ఆయన ఈ యాప్‌ ను విడుదల చేశారు. ‘నో యువర్‌ క్యాండిడేట్‌ (కేవైసీ)’ పేరుతో ఈ యాప్‌ ప్రస్తుతం గూగుల్‌ ప్లే స్టోర్‌ లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌ వినియోగదారులతో పాటు ఐఓఎస్‌ వినియోగదారులకూ ఈ యాప్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ప్రతీ ఓటరుకు తన నియోజకవర్గంలో పోటీపడుతున్న అభ్యర్థుల గురించి తెలుసుకునే హక్కు ఉందని ఆయన అన్నారు. అభ్యర్థుల నేర చరిత్ర వివరాలు తెలుసుకుంటే ఎవరికి ఓటేయాలనే దానిపై ఓటర్‌ కు స్పష్టత వస్తుందని, సరైన అభ్యర్థిని ఎన్నుకునే వెసులుబాటు ఓటర్లకు కలుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

➡️