తెలంగాణ: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తుండగా.. పలు కీలక పార్టీలు మారుతున్నాయి. ఈ క్రమంలో లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ నేత, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీజేపీ నుంచి మహబూబ్నగర్ ఎంపీ టికెట్ ఆశించి నిరాశచెందిన ఆయన తన కుమారుడు మిథున్రెడ్డితో కలిసి నిన్న (శుక్రవారం) కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు ఆయన తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు పంపారు. లేఖలో ఆయన పార్టీ మారడానికి గల కారణాలను లేఖలో వివరించారు.
తాజాగా.. బీజేపీ తన పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించినప్పుడు, మహబూబ్ నగర్ స్థానానికి అభ్యర్థిగా డికె అరుణను ఎంపిక చేశారు. ఈ స్థానం నుంచి జితేందర్ రెడ్డి పోటీ చేయాలని భావించగా, డీకే అరుణపై హైకమాండ్ మొగ్గు చూపింది. దీంతో జితేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈనేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీ మార్పుపై చర్చించారు. దీంతో.. కాంగ్రెస్లో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఆహ్వానం మేరకు జితేందర్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పార్టీలో చేరిన వెంటనే.. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, రాష్ట్ర ప్రభుత్వానికి క్రీడా వ్యవహారాల సలహాదారుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జూరీ చేసింది.