ప్రజాశక్తి-అమరావతి: గత ఎన్నికల్లో గుంటూరు నుంచి గెలుపొందిన టిడిపి ఎంపి గల్లా జయదేవ్ ఎన్నికను సవాల్ చేస్తూ వైసిపి అభ్యర్థిగా ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన మోదుగుల వేణుగోపాల్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించడం వల్ల తాను ఓడిపోయానని, జయదేవ్ ఎన్నిక చెల్లదంటూ వేణుగోపాల్రెడ్డి సవాల్ చేసిన పిటిషన్ను జస్టిస్ రావు రఘునందన్రావు డిస్మిస్ చేశారు. ఫాం 13బిలో బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ను పొందుపరచకపోవడం తేడా కిందకే వస్తుందని, అలాంటి బ్యాలెట్ పేపర్లను తిరస్కరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని బుధవారం వెలువరించిన తీర్పులో పేర్కొన్నారు. మొత్తం 9,782 పోస్టల్ బ్యాలెట్లను తిరిగి లెక్కించాక ఫలితాన్ని వెల్లడించాలన్న పిటిషనరు వినతిని తోసిపుచ్చారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/ap-high-court.jpg)