మేడారంలో వసతుల కోసం రాష్ట్రప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది : మంత్రి సీతక్క

Feb 24,2024 16:18 #Minister Seethakka, #press meet

ములుగు: మేడారం జాతర విజయవంతం కోసం కృషి చేసిన ప్రజలు, అధికారులకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 1.35 కోట్ల మంది యాత్రికులు సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారని చెప్పారు. శనివారం మేడారంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. మేడారంలో వసతుల కోసం రాష్ట్రప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు కేటాయించిందని వెల్లడించారు.

”20శాఖల అధికారులు జాతర పనుల్లో కష్టపడి పనిచేశారు. యాత్రికులకు ఇబ్బంది లేకుండా మా వంతు కఅషి చేశాం. జాతరకోసం ఆర్టీసీ దాదాపు 6వేల బస్సులను కేటాయించి.. 12వేల ట్రిప్పులు నడిపింది. మహాజాతరకు వచ్చిన యాత్రికుల్లో 5090 మంది తప్పి పోయారు. వారిలో 5062 మందిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించాం. ఇంకా 32 మంది చిన్నారులు అధికారుల వద్ద జాగ్రత్తగా ఉన్నారు. వారిని కూడా కుటుంబీకులకు క్షేమంగా అప్పగిస్తాం. తప్పిపోయిన వారి వివరాల కోసం మీడియాపాయింట్‌ , జంపన్నవాగు వద్ద ఏర్పాటు చేసిన మిస్సింగ్‌ పాయింట్‌లో సంప్రదించాలి. సోమవారం నుంచి మేడారంలో పది రోజుల పాటు పారిశుద్ధ్య పనులు జరుగుతాయి. ఇందుకోసం దాదాపు 4వేల మంది కార్మికులను నియమించాం” అని మంత్రి వివరించారు.

➡️