అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కాకరేపుతున్నాయి.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో ఎన్నికలకు వెళ్తుండగా.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి సింగిల్గానే పోటీకి సిద్ధమైంది.. ఇక, కాంగ్రెస్, కమ్యూనిస్టుల వ్యవహారం తేలాల్చి ఉంది.. అయితే, రాష్ట్రంలో తాజాగా పొత్తులపై సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి.. ఇప్పటికే మూడు పార్టీల పొత్తుపై సెటైర్లు వేసిన ఆయన.. ఇప్పుడు ”ఏపీ 2024 అసెంబ్లీ ఎన్నికలు వర్గ పోరు కాదు కుల పోరు! ” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ”వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పేద, బలహీనవర్గాల కలలను సాకారం చేసుకునేంత వరకు అండగా ఉండాలని కోరుకునే సీఎం వైఎస్ జగన్ పై.. అధికారాన్ని కేంద్రీకరించి నిలబెట్టుకోవాలనుకునే ధనవంతుల మధ్య పోటీ” అంటూ విపక్షాల పేర్లు ప్రస్తావించకుండానే సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు.
ఇక, 2014-19 మధ్య కాలంలో ఏపీ చూసిన మోసం, అబద్ధాలు, అమలు చేయని వాగ్దానాలన్నింటికీ భిన్నంగా ఈ కూటమి ఎలా ఉంటుంది? అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించిన విషయం విదితమే.. ఇది మరొక ప్యాకేజీతో ఏర్పాటైన పొత్తు దుయ్యబట్టిన ఆయన.. ఈ మూడు కాళ్ల కూటమి కుర్చీ కూలిపోతుంది అని జోస్యం చెప్పారు.. ఆంధ్రప్రదేశ్లో సుస్థిర ప్రభుత్వం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయండి అంటూ.. సోషల్ మీడియా వేదిక పిలుపునిచ్చారు.