– విఆర్ఎల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు
ప్రజాశక్తి-గుంటూరు:గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యల పరిష్కారం కోసం ఆదివారం, సోమవారం విజయవాడలో జరిగే రిలే దీక్షలను జయప్రదం చేయాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. కె.ఉమామహేశ్వరరావు కోరారు. గుంటూరులోని బ్రాడీపేటలోని శనివారం సిఐటియు కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విఆర్ఎలకు పేస్కేల్ ఇవ్వాలని, 2018 నుంచి రికవరీ చేసిన డిఎ బకాయిలను తిరిగి చెల్లించాలని, నామినీలను విఆర్ఎలుగా గుర్తించాలని, అర్హులైన వారికి ప్రమోషన్లు తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జరిగే దీక్షల్లో విఆర్ఎలు పెద్ద సంఖ్యలో పాల్గనాలని కోరారు. సమస్యలపై ఈనెల 20లోగా స్పందించని పక్షంలో ఆ తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. రాష్ట్ర అధ్యక్షులు టి.అంజి మాట్లాడుతూ… అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ బందగీసాహెబ్, రాష్ట్ర కోశాధికారి వడ్డే బాజీబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి బి.ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.